హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన
డీఆర్డీవో హాస్పిటల్లో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, శ్రీనివాస్ యాదవ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత వారితో చర్చలు జరపకుండా కార్మికులను అవమానించారని విమర్శించారు. కార్మికులు సమ్మెకు దిగితే సెల్ఫ్ డిస్మిస్ అంటూ వారిని భయపెట్టారని, ప్రభుత్వ బెదిరింపు చర్యలతోనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మొండివైఖరి, నిర్లక్ష్య వైఖరి కారణంగానే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఆత్మహత్యకు పురిగొల్పితే ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.