ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై, ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి
తన ఫేస్ బుక్ పేజీ లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
'తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతాచారి తరహాలో బలిదానం చేసుకుంటే సీఎం దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరం. ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్ గారికి బాగా తెలిసిన విద్య కానీ... వాటిని చూసి చలించే తత్వం దొరగారికి లేదనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి దొరగారి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే... బతికి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే.. దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చు. ఆర్టీసీ సమ్మెపై ఓ వైపు ప్రాణత్యాగాలకు ఉద్యోగులు సిద్ధపడుతుంటే.. కేసీఆర్ గారు స్పందించిన తీరు ఆయన నిరంకుశ పాలనకు అద్దంపడుతోంది. సమ్మె ప్రభావం లేకుండా అన్ని ప్రత్యామ్నాయ చర్యలూ తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు తిరుగుతున్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా మరో వారం రోజుల పాటూ బడులకు దసరా సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. నిజంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే, స్కూళ్లకు సెలవులు ఎందుకు పొడిగించారో వివరణ నివ్వాలి. టీఆర్ఎస్ సర్కారు వైఖరిని చూస్తుంటే... మళ్లీ బస్సులు సజావుగా నడిచే వరకు పాఠశాలల సెలవులను పొడగిస్తారేమో అన్న అనుమానం కలుగుతోంది. అదే గనుక జరిగితే పాఠశాలలకు దసరాకు మొదలైన సెలవులు సంక్రాతి వరకు కొనగాగుతాయేమో?...