ఒక విజయం...వెంటనే మరొక సమరం. ఎన్నిక ముగిస్తే..ఉప ఎన్నికకు తెరలేస్తుంది. ఏడాది కాలంలో టిఆర్ఎస్ పార్టీకి వరుస ఎన్నికలు. అన్నీ ప్రతిష్టాత్మకమే..అంతటా సమరమే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గులాబీ నేతలకు వెంటనే వరంగల్ ఉప ఎన్నిక పొంచి ఉంది. వీటి తర్వాత రాబోయే ఏడాదంతా ఎన్నికల సమరమే కానుంది.
తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికల నగరా మోగింది. స్వరాష్ట్రం వచ్చింది...స్వయంపాలన కావాలంటూ టిఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది. ఈ ఎన్నికలు ముగిస్తే...వచ్చే ఐదేళ్ల వరకు ఇక రాజకీయాలుండవు...అంతా అభివృద్ధి మంత్రమే అని చెప్పింది. గత సమైక్య రాష్ట్రంలో వలే కాకుండా అఖిలపక్ష సమావేశాలు, అందరి అభిప్రాయాలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతామని చెప్పింది. కానీ వాస్తవంగా ఈ ఏడాది పాలనలో అంతటా ఎన్నికల వాతావరణమే. రాబోయే కాలం కూడా ఎన్నికల సమరానికే సై అంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించిన తర్వాత సిఎంగా అధికారం చేపట్టాలని నిర్ణయించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మెదక్ ఉప ఎన్నిక మొదలైంది. టీడీపీ-టిఆర్ఎస్ మధ్య హోరాహోరిగా ఈ పోరు జరిగింది. చివరకు గులాబీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచారు.
మెదక్ లోక్ సభ ఉపఎన్నిక పూర్తి కాగానే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలొచ్చాయి. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు చిన్నవే అయినా...అధికార పార్టీగా రంగంలో దిగుతున్నందుకు బోర్డును దక్కించుకునేందుకు టిఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి ప్రచారం చేశారు. గులాబీ జెండా ఎగురేశారు. ఇవి పూర్తి కాగానే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్. పోటీ చేసే స్థానాలు రెండే అయినా...ఆరు జిల్లాల ఎన్నికలు కావడంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ముమ్మరంగా కొనసాగింది. ఇందులో ఒక సీటు ఓడి, మరొక సీటు గెలిచి టిఆర్ఎస్ కొంత నిరాశకు గురైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఎన్నికలు జరగడంతో గులాబీ నేతలంతా ఈ ఎలక్షన్లలోనే పనిచేశారు. ఇది పూర్తి కాగానే ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు పోటీ చేయడంతో ఈ సమరం నువ్వా? నేనా? అన్నట్టు సాగి టిఆర్ఎస్ విజయం సాధించింది.
ఏడాది మొత్తం దాదాపుగా ఎన్నికలతోనే సాగింది. ఏడాది ఉత్సవాలకు ముందు ఒక రోజు ఎన్నిక పూర్తి కాగా...ఇప్పుడు మళ్లీ వెంటనే మరో ఎన్నికకు తెరలేచింది. వరంగల్ ఎంపీగా ఉండి డిప్యూటీ సిఎం పదవిని చేపట్టిన కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలుపొందారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసే ముహూర్తం దగ్గరపడింది. శ్రీహరి రాజీనామాతో ఓరుగల్లు లోక్ సభ ఉప పోరుకు గులాబీ సేన మళ్లీ సిద్ధం కావల్సి ఉంది. శ్రీహరి రాజీనామా తర్వాత టీడీపీ నుంచి వచ్చి మంత్రిగా కొనసాగుతున్న తలసాని రాజీనామా కూడా ఆమోదించాల్సి వస్తుందనే వాదన ఉంది. ఇది జరిగితే నగర పోరు తప్పదు. సనత్ నగర్ ఉప ఎన్నిక ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముమ్మరంగా కొనసాగుతుంది. దీని తర్వాత ఈ ఏడాది చివరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎదురు చూస్తున్నాయి.
త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మొత్తం తొమ్మిది స్థానాలకు ఈ ఎన్నికలు జరగనుండడంతో, అన్ని పార్టీలు వీటిని సవాల్ గా తీసుకుంటాయి. క్యాంపులు, గ్రూపులు, కొనుగోళ్లు, అమ్మకాలు విస్తృతంగా సాగుతాయి. వీటి తర్వాత వాయిదా వేస్తూ వస్తున్న ఈ ఎన్నికల్లో ఏడాది చివరలో నిర్వహించక తప్పని పరిస్థితి. నగర మేయర్ పదవిపై మొదటి నుంచి కన్నేసిన టిఆర్ఎస్ పార్టీ...ఈ ఎన్నికల కోసం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పావులు కదుపుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలు హాట్ హాట్ గా జరగనున్నాయి. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తాజాగా మండిపడింది. వెంటనే వీరి సంగతి తేల్చకపోతే తానే నిర్ణయం తీసుకుంటానంది. ఈ అంశంలో ఫిరాయించిన వారి రాజీనామాలు ఆమోదించే పరిస్థితి వస్తే టీడీపీ నుంచి ఐదు, కాంగ్రెస్ నుంచి నాలుగు, వైకాపా నుంచి రెండు స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవు. ఈ ఉప ఎన్నికలు జరిగితే...వాటి తీవ్రత ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా టిఆర్ఎస్ పాలన రెండో ఏడాది కూడా ఎన్నికల ఏడాదిగా మారనుంది. తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికల్లో విజయం సాధించాలనే తాపత్రయంతో టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంటే...నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీని ఆకాశం నుంచి కిందకు దించాలనే కసిలో ప్రతిపక్షాలున్నాయి. దీంతో ప్రతి ఎన్నిక ఒక సమరంగా మారుతోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని పంతాలు, వింతలు చూడాల్సి ఉందో.