అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని, ఆ తరువాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ రోజు
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, తమ పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఇక ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో ఇప్పుడే అర్థమవుతోందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని పవన్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నాయకులు పొత్తు కోసం తనను సంప్రదించారని... కానీ ఒంటరిగా పోటీ చేయాలని అనుకున్నందునే వారితో పొత్తు పెట్టుకోలేదని పవన్ స్పష్టం చేశారు.
అలాగే... ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను పవన్ కల్యాణ్, పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ను కలిసి పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ వెంట పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను జనసేనాని గవర్నర్తో చర్చించినట్లు సమాచారం.