వలసలు...! పుట్టి పెరిగిన ఊరిలో ఉపాధి కరువైంది. పొలం ఉన్న బోరు బావుల్లో నీరు లేదు..! పంటకాలువలు వస్తాయన్న మాట తాతల కాలం నుంచి నినుడేకానీ...కాలువలు వచ్చింది లేదు..! చూసింది లేదు..! ఇక చెరువుల కింద భూములున్నోళ్లకు పారేది కూడా తక్కువే..! ఉన్నవి రెండే దారులు..! ఒకటి పట్నం వలస పోవాలి...లేదా గల్ఫ్ కు వలస కార్మికుడిగా వెళ్లాలి..! ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల గోస కాదు..! దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వలసలు కనిపిస్తున్నాయ్.
బ్రతుకు దెరువు కోసం ప్రజలందరూ పట్నం బాట పడుతున్నారు. మారుమూల మురికివాడల్లో కాసింత ఉండేందుకు ఇంత చోటులో బ్రతులకు వెళ్లదీస్తున్నారు. అడ్డ మీద కూలీలు అవుతున్నారు. కాసింత నైపుణ్యం ఉన్నల్లో ఫ్యాక్టరీల్లో కార్మికులు అవుతున్నారు. ప్రాణం చేతగానోళ్లు సెక్యూరిటీగార్డులుగా వాచ్ మెన్ లుగా సెటిల్ అవుతున్నారు.
ఈ వలసలకు తోడు బంగ్లాదేశీయుల అక్రమ వలసలు...! ఇప్పుడున్నది వలస భారతం..! బ్రతుకు దెరువు కోసం వలస వస్తున్న ఈ భూమి పుత్రులకు మురికివాడలే దిక్కు.! మరి మన నగరాలు ఈ వలసలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయా అంటే అది కూడా లేదు..! ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పినట్లుగా మన దేశంలో పట్టణాల విస్తరణను ఇప్పటి వరకు పాలకులు కాకుండా రియల్ఎస్టేట్ డెవలపర్లే నిర్దేశించారనేది కఠోర సత్యం...! ఏదో అరకోర లే అవూట్ల కే ఓకే చెప్పి...మన పురపాకల సంఘాలు చేతులు దులుపుకుంటున్నాయ్. ప్రక్కా ప్రణాళిక బద్ధంగా నగరాల విస్తరణ జరగడం లేదన్నది వాస్తావం. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా, విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలను మన పాలకులు...ఇటు బ్యూరోకాట్లు పట్టించుకోలేదు...ఫలితం దేశంలో నగరాలు అంటే మురికి కూపాలుగా మారాయ్.
ఇక మన తెలుగు రాష్ట్రాల నగరాలు, పట్టణాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామంటున్నారు. నిధులు కూడా భారీగా కేటాయిస్తున్నారు. అయితే ఏం లాభం గంటల కొద్ది ట్రాఫిక్ జాములు...! ఉద్యోగస్థులు ఆఫీసులకు వెళ్లాలంటే గంట ముందు నుంచే ఇంటి నుంచి బయలు దేరాల్సిన దుస్థితి. అయినా కూడా సమయానికి తమ గమ్యస్థానాలకు చెరుకుంటారనే గ్యారెంటీ లేదు. ఇక చినుకు పడితే చాలు.... హైదరాబాద్ లోని మెయిన్ రోడ్డులు చెరువులను ..నదులను తలపిస్తాయ్. గ్రేటర్ లో సెంటిమీటర్ వర్షం పడిందంటే చాలూ...వాహనదారులకు నరకమే..!
తెలంగాణలోని మరో నగరం వరంగల్ కార్పొరేషన్...ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో...ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు తెలిసింది. వేల సంఖ్యలో జనం మురికివాడల్లోనే తమ బ్రతుకు దెరువును వెళ్లదీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికంలో పుట్టారు..పేదలుగానే మరణిస్తారు..వీళ్ల బతుకుల్లో భాగ్య రేఖలు ఎప్పుడో చెప్పడం కష్టం..!
ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఎంపిక చేశారు. వీటితోపాటు మరో 31 నగర పాలక సంస్థలు కూడా ఈ పథకానికి అర్హత సాధించాయ్. విశాఖ పట్నాన్ని అమెరికా సాయంతో స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సాధించింది. విజయవాడ ఇప్పటికే కార్పొరేషన్...ఏపీ నూతన రాజధానికి మెయిన్ సెంటర్..! మొదటి దశలో అర్హత సాధించిన ఈ నగరాలు రెండో దశ పరీక్షలో ఎంత వరకు నిలబడతాయనేది ప్రశ్నగా ఉంది.
రెండో దశ అర్హతలో భాగంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కార్పొరేషన్లు ఆయా ప్రాంతాల వారిగా స్మార్ట్ సిటీ ప్లాన్స్ ను సమర్పించాల్సివుంటుంది. ఈ ప్రణాళికలను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నియమించే ఉన్నతస్థాయి కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది. స్మార్ట్ సిటీ ప్రణాళికల్లో భాగంగా... నగర స్థాయి ప్రమాణాలకు 30 పాయింట్లు, ప్రతిపాదనల స్థాయి ప్రమాణాలకు 70 పాయింట్లు కేటాయిస్తారు. భవన నిర్మాణాలకు సగటున ఎన్ని రోజుల్లో అనుమతులు జారీ చేస్తున్నారు? ఆస్తి పన్ను మదింపు, పెంపు ఎలా ఉంది? విద్యుత్ సరఫరా, ట్రాఫిక్, ఐటీ సేవల వినియోగం వంటి అంశాలను ‘నగరస్థాయి ప్రమాణాల్లో’ భాగంగా పరిశీలిస్తారు. రెండు దశల పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 20 నగరాలను వెంటనే స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తారు. వాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు సమకూర్చుతారు. మిగిలిన నగరాలకు సంబంధించి తాము గుర్తించిన లోపాలు, వాటిని సరిదిద్దుకునే అవకాశాల గురించి అపెక్స్ కమిటీ వివరిస్తుంది. తదుపరి రెండు విడతల్లో జరిగే పోటీలో పాల్గొనేందుకు వీటికి అవకాశం లభిస్తుంది. మరి మన తెలుగు నగరాలు ఈ పోటీలో ఎంత వరకు రాణిస్తాయో వేచి చూడాలి!