ఆదివారం ఈస్టర్ సందర్భంగా ఆ దేశంలోని క్రైస్తవులంతా వందల సంఖ్యలో చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఉగ్రమూక చర్చిలు, హోటళ్లపై దాడి చేసింది. ఫలితంగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, క్షతగాత్రులు ఆస్పత్రుల పాలయ్యారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉదయం నుంచి ఇప్పటి వరకూ జరిగిన 7 బాంబు పేలుళ్లలో 185 మంది ప్రాణాలు కోల్పోయిట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 35 మంది విదేశీయులేనట. నటి రాధిక తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలను ఆ దేవుడే రక్షించాలి అంటూ ప్రార్థించారు. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, బాలీవుడ్ నటులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
- ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్ రాజ్
- శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. లంక ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాను- విశాల్
- ఓ మై గాడ్. కొలంబోలోని సిన్నమన్ హోటల్ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను- రాధికా శరత్కుమార్
- ఈస్టర్ పర్వదినాన జరిగిన ఈ దాడిని చూసి గుండెపగిలిపోయింది- సుధీర్బాబు
- ఇది జరిగి ఉండకూడదు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు ఎంత బాధపడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది. దేవుడా..కాపాడు- నివేదా థామస్
- ఈస్టర్ సండే ట్రాజెడీగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేదే ఉండదు. బలహీన సమయాల్లోనే కుటుంబాలపై, పిల్లలపై దాడులు చేస్తుంటారు- సిద్ధార్థ్
- షాకింగ్.. బాధాకరం- సౌందర్య రజనీకాంత్
- శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్ రియాక్షన్లా మారిపోయిందని ఎవ్వరూ గుర్తించకపోవడం దురదృష్టకరం. దీనికి ముగింపు పలకాలి- బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్
- దాడుల గురించి విని షాకయ్యాను. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి దాడికి పాల్పడినందుకు ఉగ్రవాదులు సిగ్గుపడాలి. బాధితులు తర్వగా కోలుకోవాలని, మృతుల కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేం మీతో ఉన్నాం శ్రీలంక. నిర్భయంగా ఉండండి- బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్