మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 288 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చెరో 125 స్థానాలలో పోటీ చేసేందుకు ఇరు పార్టీలు ఒప్పందం
కుదుర్చుకున్నాయి. తక్కిన 38 సీట్లలో భాగస్వామ్య పార్టీలు పోటీ పడనున్నాయి. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడానికి ముందు చవాన్ మీడియాతో మాట్లాడుతూ... సీట్ల పంపకాల ఫార్ములాపై వంచిత్ బహుజన్ అఘాడి (ప్రకాష్ అంబేడ్కర్), స్వాభిమాన్ షెట్కారి సంఘటన, సమాజ్వాదీ పార్టీలో చర్చలు సాగించినట్టు చెప్పారు.
కాగా... వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతుండటంపై మాట్లాడుతూ... అధికార బీజేపీ ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గుండెకాయ వంటివని, అయితే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. దేశాన్ని ఏకపార్టీ పాలనలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.