ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుండా మనిషి జీవితం సాగడం లేదు..సమయానికి తిండి లేకపోయినా
ఉంటారేమో గానీ...సోషల్ మీడియా లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. దాని సంగతి అలా ఉంచితే మనం ఎక్కడికైనా వెళ్లాలంటే దాని అడ్రస్ తెలుసుకునేందుకు గూగుల్..కంపెనీలు, కాలేజీలు, బ్యాంకులు ఇలా ఒకటేమిటి గూగుల్ ని అడిగితే దేని గురించైనా ఇట్టే చెప్పేస్తుంది. అలాంటి గూగుల్ పై మరోసారి పిడుగు పడింది. ఈ ప్రముఖ సెర్చింజన్ తన విధులను మరిచిపోయి వినియోగదారుల నమ్మకం కోల్పోయేలా చేసిందని యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ పేర్కొంది. ఇందుకు గూగుల్ కు భారీ జరిమానా విధించింది. ఈ విషయంపై ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరేట్ వెస్టాగర్ మాట్లాడుతూ...‘ఈరోజు కమిషన్ గూగుల్కు భారీ జరిమానా విధించింది. 1.49 బిలియన్ యూరోలు (రూ.110 కోట్ల పైనే) జరిమానా కింద చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో ఆ సంస్థకున్న మంచి పేరును, అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేసింది. ఈ సంస్థ వల్ల కొన్ని కంపెనీలు బాగా లాభాలు గడిస్తున్నాయి. వినియోగదారులు మోసపోతున్నారు. కస్టమర్లే ప్రతి కంపెనీకి ప్రధానం. వారి విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గూగుల్ గురి చేస్తోంది. ఇది వినియోగదారుల చట్టాలకు విరుద్ధం. వారి స్వేచ్ఛను, ఎంపికను ఈ సంస్థ హరిస్తోంది.దీని వల్ల గూగుల్ తన సుస్థిర స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని తెలిపారు. మరి ఈ విషయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎలా స్పందిస్తారో..వినియోగదారులు గూగుల్ వల్ల మోసపోతున్నారని ఆరోపిస్తున్న కమిషన్ గురించి ఆయన ఏమంటారో చూడాలి.