వంట గ్యాస్(ఎల్పీజీ) ధర భారీగా తగ్గింది. ఒక సబ్సిడీ ఎల్పీజీ సిలెండరుపై రూ.6.52 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. దేశ రాజధాని
ఢిల్లీలో కొత్త ధర ప్రకారం 14.2కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు రూ.500.90కె లభ్యమవనుంది. ప్రస్తుతం అక్కడ రూ.507.42గా ఉంది. ఈ తగ్గింపు ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధర సిలెండరు ధర పెరుగుతూనే వచ్చింది. ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా రూ.14.13 గ్యాస్ ధర పెరిగింది. డాలరుతో రూపాయి విలువ బలపడటంతో పాటు, అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పడిపోవడంతో ఎల్పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ ఆ ప్రకటనలో వివరించింది. అలాగే సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50 ఉండగా ఇప్పటి నుంచి రూ.809.50కె లభ్యమవనుంది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా అందచేస్తున్న 12 సిలెండర్ల సబ్సిడీ నగదు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవనుంది. డిసెంబరు నెల నుంచి వినియోగదారులకు సబ్సిడీ కింద రూ.308.60 నగదును బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.